మనల్ని మనం మార్చుకోవాలి

  • ఐటీ కార్యదర్శి జయేశ్‌రంజన్‌

మాదాపూర్‌, మార్చి 17: ప్రకృతిలో వచ్చిన మార్పుల కారణంగా మనల్ని మనం మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఐటీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ అన్నారు. ఇండియన్‌ పల్ప్‌, పేపర్‌ టెక్నికల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో ఇప్టా 58వ వార్షిక సర్వసభ్య సమావేశంలో భాగంగా హరిత ఉత్పత్తి దిశగా కాగితం పరిశ్రమను సిద్ధం చేయడం అనే అంశంపై జరిగిన సదస్సుకు ముఖ్య అతిథిగా ఐటీ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ హాజరయ్యారు. ఈహెచ్‌ఎస్‌, ఏఎఫ్‌ఆర్‌, ఎనర్జీ అండ్‌ సస్టెయినబిలిటీ కార్పొరేట్‌ హెడ్‌ కేఎన్‌రావుతో పాటు ఇప్టా అసోసియేషన్‌ సభ్యులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా జయేశ్‌ రంజన్‌ మాట్లాడుతూ వాతావరణ మార్పుల ప్రభావం అన్నిచోట్ల కనబడుతున్నదని, మనల్ని మనం సరిదిద్దుకోవడానికి, కాపాడుకోవడానికి ప్రకృతి రకరకాలుగా సంకేతాలను ఇస్తుందన్నారు. ఇప్పటి వరకు జరిగిన కార్బన ఉద్గారాలతో భూమి కలుషితమైందని, భూమాత ఎంతో సహనంతో సహిస్తూ వస్తున్నదని, వాతావరణ మార్పులు మనుషుల జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందన్నారు. ఇంధన వనరులను పరిమితంగా ఉపయోగించుకోవడానికి కావాల్సిన ఆలోచనలను రేకెత్తించే స్టార్టప్‌లను ప్రోత్సహించడం ద్వారా దీర్ఘకాలిక పరిష్కారాలు చూడవచ్చని తెలిపారు. అనంతరం ప్రొఫెషనలిజం, ఎంటర్‌ప్రెన్యూరిల్‌, టెక్నాలజీ ప్రొవైడర్స్‌, రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ అకాడమిక్స్‌ వంటి పలు విభాగాలకు చెందిన ప్రముఖులకు ఐపీపీఏ ఏర్పాటు చేసిన లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులను ప్రదానం చేశారు.

2023-03-17T23:34:36Z dg43tfdfdgfd