HOLI | ఆనందాల కేళి హోలీ.. రసాయన రంగులతో పొంచి ఉన్న ప్రమాదం

జహీరాబాద్, మార్చి 13: ఆనందాల కేళి హోలీ (Holi).. ఈ రంగుల పండుగ వస్తుందంటే చాలు చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ రంగుల్లో మునిగితేలుతుంటారు. బంధుత్వాలను, స్నేహాలను మరింత దగ్గర చేసేందుకు ఇలాంటి కలర్‌ఫుల్ ఫెస్టివల్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు హోలీ, కాముని పున్నమి, డోలికోత్సవం జరుపుకుంటారు. హిందూ పురాణాల ప్రకారం, హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. ‘హోలికా పూర్ణిమ’ రోజునే హోలీ పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది మార్చి 14న హోలీ పండుగ వచ్చింది. ఈ సందర్భంగా రంగుల పండుగ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం…

హోలీ ఎప్పటినుంచి ప్రారంభమైందంటే..

హిందూ పురాణాల ప్రకారం, రాధా, క్రిష్ణులతో హోలీ పండుగ ప్రారంభమైంది. చిన్నతనంలో కన్నయ్య రాధ ముఖానికి రంగు పూసి ఆటపట్టించేవాడు. యశోద కూడా కన్నయ్య సరదాల్ని చూసి నవ్వుతూ మురిసిపోయేదట. అలా అప్పటినుంచి ప్రతి సంవత్సరం హోలీ జరుపుకునే సంప్రదాయం ప్రారంభమైంది. హోలీ వేళ కృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలోని పువ్వులతో, రంగులతో ఈ ఉత్సవాన్ని జరుపుకున్నట్లుగా భావిస్తారు. ఇలా రంగులు, పూలు చల్లుకోవడం ద్వారా ప్రేమ, సౌభాగ్యాలు వెల్లివిరిస్తాయని నమ్ముతారు.

హోలికా దహనం..

మరో కథనం ప్రకారం, రాక్షస రాజు హిరణ్యకశపుడి కుమారుడు ప్రహ్లాదుడు నిత్యం విష్ణు మూర్తిని స్మరిస్తుంటాడు. అది హిరణ్యకశపుడికి నచ్చదు. దీంతో ప్రహ్లాదుడిని మట్టుబెట్టాలని నిర్ణయించుకుంటాడు. దీంతో అతని రాక్షస సోదరి హోళికను పిలుస్తాడు. ఆమెకు ఉన్న శక్తితో ప్రహ్లాదుడిని మంటల్లో ఆహుతి చేయాలని ఆమెను కొరతాడు. దీంతో ఆమె ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకుని మంటల్లోకి దూకుతుంది. అయితే, విష్ణు మాయతో ప్రహ్లాదుడు ప్రాణాలతో బయపడగా, హోళిక రాక్షసి మాత్రం ఆ మంటల్లో చనిపోతుంది. హోలిక దహనమైన రోజునే ‘హోలీ’ అని పిలుస్తారనే ప్రచారం ఉంది. అందుకే కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళ ‘రంగులతో వేసవి కాలానికి స్వాగతం..

శీతా కాలానికి వీడ్కోలు పలికి..

హోలి పండుగ వేళ సహజమైన రంగులను జల్లుకోవడం వల్ల అందరూ సంతోషకరమైన అనుభూతిని పొందుతారు. అంతేకాదు హోలికా దహనం మరుసటి రోజు నుంచే శీతాకాలానికి వీడ్కోలు పలికి.. వేసవికాలంలోకి అడుగుపెడతాం. ఈ సమయంలో రంగులను ఉపయోగించడం వల్ల మన చర్మంపై బ్యాక్టీరియా ప్రభావం తగ్గుతుంది.

బద్ధకస్తులు చురుగ్గా మారతారు..

శాస్త్రీయ పరంగా.. హోలీ పండుగ సమయంలో వాతావరణంలో జరిగే మార్పుల వల్ల మనమంతా త్వరగా అలసిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో మనం చాలా త్వరగా నీరసపడిపోతుంటాం. ఇలాంటి సమయంలో హోలీ రంగులను జల్లుకోవడానికి వీధుల్లోకి రావడం వల్ల నీరసాన్ని అధిగమించొచ్చు. బద్ధకస్తులు కాస్త చురుగ్గా మారతారు. అంతేకాదు కాలనీల్లో, రోడ్లపైకి జనాలందరూ వచ్చి రంగులు చల్లుకుంటూ డిజే మ్యూజిక్, డ్యాన్సులు, పార్టీలు ఇతర కార్యక్రమాలను నిర్వహించడం వల్ల మీలో ఉత్సాహం పెరిగిపోతుంది.

సహజ రంగులతో..

హోలీ పండుగ సమయంలో సహజ రంగులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే పూర్వకాలంలో హోలీ పండుగలో రంగులను చల్లుకునేందుకు సహజ రంగులను వాడేవారు. ముందుగా ఎండిన పువ్వులను, ఇతర ఆకులతో కలిపి రంగులను తయారు చేసేవారు. అదే సంప్రదాయాన్ని ఇప్పటికీ ఉత్తర భారతంలో కొనసాగిస్తున్నారు. ఈ సహజ రంగులను మన శరీరంపై జల్లుకోవడం వల్ల చర్మ సమస్యల నుంచి బయటపడొచ్చు.’ దహనం నిర్వహిస్తారు.

హోలీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు…

  • కళ్లకు హాని కలుగకుండా సన్‌గ్లాసెస్‌ వాడాలి. దంతాలపై రంగులు పడకుండా డెంటల్‌ క్యాప్స్‌ వేసుకోవాలి.
  • హోలీ వేడుకల్లో మందంపాటి పాత దుస్తులను ధరించాలి.
  • ముదురు రంగు దుస్తులు మంచిది. ఫుల్‌హ్యాండ్స్‌ షర్ట్‌, చేతులకు గ్లౌజులు, కాళ్లకు సాక్స్‌ వేసుకోవాలి.
  • కళ్లల్లో రంగు పడితే వెంటనే చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. మంట అనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి.
  • తలపై రంగులు పడకుండా క్యాప్‌ పెట్టుకోవాలి. రంగులు చల్లుకోవడం పూర్తయ్యాక గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.

సహజ రంగుల తయారీ ఇలా..

  • పసుపు, కుంకుమ, పూలు, పండ్లు వివిధ రకాల పిండిని నీటిలో కలిపి ఉపయోగించుకోవచ్చు.
  • మోదుగు పూలను ఉడక బెట్టి సహజ సిద్ధమైన రంగు తయారు చేసుకొని వాడవచ్చు.
  • గంధం, ఎర్రమందార, గోగుపూలు, దానిమ్మ తొక్క, టమాట, క్యారెట్‌, పసుపు, సున్నం మిశ్రమం కలిస్తే ఎరుపు రంగు వస్తుంది.
  • శనగపిండి, పసుపు మిశ్రమం, బంతి, చామంతి పూల మిశ్రమంతో పసుపురంగు వస్తుంది.
  • గోరింటాకు, గుల్‌మొహర్‌ ఆకులు, గోధుమ మొలకలు, పాలకూర, కొత్తిమీర, పుదీనాతో ఆకుపచ్చ రంగు తయారు చేసుకోవచ్చు.
  • ఇండిగో ప్లాంట్‌(సిరాచెట్టు)కాయలతో నీలిరంగు తయారు చేసుకోవచ్చు.
  • బీట్‌రూట్‌, ఉల్లిపాయ తొక్కల మిశ్రమంతో ముదురు కెంపు రంగు వస్తుంది. పారిజాత పూల కాండాలను ఎండబెట్టి నానబెడితే సింధూరం రంగు వస్తుంది.
  • బ్రౌన్‌ కలర్‌ కోసం కాఫీ లేదా టీ పొడి కలిపి వడపోసిన నీళ్లు లేదా మరగపెట్టిన నీళ్లు ఉపయోగించుకోవచ్చు.
  • నల్లద్రాక్ష రసం లేదా ఎండబెట్టిన పెద్ద ఉసిరికాయల్ని ఉడికించి రాత్రంతా అలా వదిలేసి మరునాడు నీటిలో కలిపితే నలుపు రంగు తయారవుతుంది.
  • ఎర్రచందనాన్ని నీటిలో కలిపి ఎరుపు రంగును పొందవచ్చు.
  • గోరింటాకును రుబ్బి పిండిలో కలిపితే ఆకుపచ్చ రంగును తయారు చేసుకోవచ్చు.
  • రెండు చెంచాల గంధపు పొడిని లీటర్‌ నీటిలో కలిపి మరగబెడితే ఎరుపు రంగు ద్రావణం తయారు చేసుకోవచ్చు.
  • నీలి మందును నీటిలో కలిపితే నీలి రంగు వస్తుంది.
  • తులసి, వేప, కలబంద కలిపి నూరి నీటిలో కలిపితే ముదురు ఆకుపచ్చ వర్ణం వస్తుంది.

సహజ రంగులతో ఉపయోగాలు

పసుపుతో చేసిన రంగులు వ్యాధి నిరోధక శక్తిని పెంపొదిస్తాయి. తులసి ఆకులతో చేసిన రంగులు మానసికోల్లాసానికి తోడ్పడుతాయి. శ్వాసక్రియ శక్తిని పెంచుతాయి. కలబంద, వేపాకులు చర్మ వ్యాధులను తగ్గిస్తాయి. దురదల నివారణకు ఉపయోగపడుతాయి. గోరింటాకు శరీర పగుళ్లను నివారిస్తుంది. గంధం పొడి మనసుకు ప్రశాంతత కలిగించడంతోపాటు సువాసన వెదజల్లుతుంది.

2025-03-13T04:42:08Z