GANESH VISARJAN 2024 గణపతి నిమజ్జనం వెనకున్న రహస్యాలేంటో తెలుసా...

Ganesh Visarjan 2024 వినాయక విగ్రహాలను నీటిలోనే ఎందుకు నిమజ్జనం చేస్తారు.. ఇలా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి.. దీని వెనుక ఉన్న రహస్యాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

Ganesh Visarjan 2024 ఈ ఏడాది వినాయక చవితి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో రకరకాల వినాయక ప్రతిమలను ప్రతిష్టించారు. ఇదిలా ఉండగా.. వినాయక చవితి ఉత్సవాలను జరుపుకున్న వారంతా ఇప్పుడు నిమజ్జనానికి సిద్ధమవుతున్నారు. గణేష్ నిమజ్జన వేడుకల్లో చిన్నపిల్లల నుంచి పెద్దొళ్ల వరకు, యువతలో ఉత్సాహం ఎంతలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విశ్వవ్యాప్తంగా ఉండే ఉత్సవాలన్నీ ఒక ఎత్తు అయితే.. నిమజ్జనోత్సవం మాత్రం మరో ఎత్తు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. వినాయకుని విగ్రహాలను నీటిలోనే ఎందుకు నిమజ్జనం చేస్తారు.. దీని వెనుక కారణాలేంటనే ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం...అనంత చతుర్థశి రోజున..

హిందూ సంప్రదాయం ప్రకారం, వినాయక చవితి తర్వాత సరిగ్గా పదిరోజుల తర్వాత అంటే అనంత చతుర్దశి రోజున వినాయక నిమజ్జనం జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున వినాయకుడి విగ్రహాలను ప్రవహించే నదులు, కాలువలు లేదా ఏదైనా చెరువులో నిమజ్జనం చేస్తారు. అంతకుముందు రోడ్లపై ఘనంగా ఊరేగింపు నిర్వహిస్తారు. యువత డీజే డ్యాన్సులు, మేళ తాళాలు, డ్రమ్స్, వాయిద్యాల నడుమ అందరూ ఉత్సాహంగా నిమజ్జనోత్సవంలో పాల్గొంటారు.

నిమజ్జనం ఎప్పుడు ప్రారంభమైందంటే..

వినాయక చవితిని ఎవరు ప్రారంభించారంటే చాలా మంది చెప్పే సమాధానం మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ మహారాజు ప్రారంభించారనే చెబుతారు. మరోవైపు పశ్చిమ బెంగాల్ లో బాల గంగాధర్ తిలక్ ప్రారంభించారని చెబుతారు. ఇక పూర్వ కాలంలో అయితే శాతవాహనులు, చోళులు వినాయక చవితి పండుగను జరుపుకున్నట్లు కొందరు నిపుణులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.

నిమజ్జనం ఎందుకంటే..

సాధారణంగా వినాయక చవితి పండుగ వర్షాకాలంలోనే వస్తుంది. ఈ కాలంలో చెరువుల నుండి మట్టి సేకరించి.. ఆ మట్టితోనే వినాయక విగ్రహాలు తయారు చేసి వాటిని పూజించి, తర్వాత తిరిగి అదే నీటిలో నిమజ్జనం చేస్తారు. ఇలా చెరువుల విగ్రహాల తయారీ కోసం మట్టిని తీసుకోవడం వల్ల అక్కడ లోతు పెరుగుతుంది.

ఆయుర్వేద గుణాలు..

అంతేకాదు వినాయక విగ్రహాలకు నీటిలో పత్రితో కలిపి నిమజ్జనం చేయడం వల్ల నీరు సులభంగా ప్రవహించేందుకు వీలు కలుగుతుంది. అంతేకాదు ఆయుర్వేద గుణాలు కూడా మనకు లభిస్తాయి. ఇవే నీటిని మనం తాగడం వల్ల ఆరోగ్య పరంగా ఎలాంటి ఇబ్బందులు రావని చాలా మంది నమ్ముతారు.

తొమ్మిది రోజులు పూర్తయ్యాక..

గణేష్ విగ్రహాలను తయారు చేసేందుకు వాడిన మట్టి, పత్రి, గరిక ఇతర వస్తువుల వల్ల నీటిలో ఉండే చిన్న చిన్న పురుగులు, కీటకాలన్నీ మరణిస్తాయి. దీంతో నీరు శుభ్రంగా మారుతుంది. మరో కథనం ప్రకారం.. ఏ దేవుని విగ్రహమైనా మట్టితో, దాన్ని పూజించేందుకు 9 రోజులు మాత్రమే అర్హత ఉంటుంది. ఆ తర్వాత అందులోని దైవత్వం మాయమవుతుందని, అందుకే వినాయక ప్రతిమలను తొమ్మిది రోజులు పూర్తయ్యక నిమజ్జనం చేయాలని చెబుతారు.

సమస్యలన్నీ తొలగిపోతాయట..

పురాణాల ప్రకారం, వినాయకుడు అనంత చతుర్దశి రోజున తన తల్లిదండ్రులు పార్వతీపరమేశ్వరుల దగ్గరికి వెళ్తాడు. అంటే వినాయక నిమజ్జనం మనుషుల చావు, పుట్టుక చక్రాల ప్రాముఖ్యతను సూచిస్తుందని పండితులు చెబుతారు. నిమజ్జనం నిమిత్తం వినాయకుడి విగ్రహం బయటకు తీస్తున్నప్పుడు ఇంట్లో ఉండే సమస్యలన్నీ తొలగిపోతాయని చాలా మంది నమ్మకం. వినాయకుడిని నీటిలో నిమజ్జనం చేసినప్పుడు మనకు జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నీ తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు.గమనిక : ఇక్కడ అందించిన భక్తి సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.Read Latest Religion News and Telugu News

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-09-07T13:05:30Z dg43tfdfdgfd