శ్రీశైలం మల్లన్నకు భక్తుడి ఖరీదైన కానుక.. ఏకంగా 108 బంగారు పుష్పాలు

శ్రీశైలం మల్లన్నకు మరో భక్తుడు ఖరీదైన కానుకను అందజేశారు. కర్నూలుకు చెందిన బీసీ శివకుమార్‌ అనే భక్తుడు కుటుంబ సమేతంగా కలిసి భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు 108 బంగారు పూలను బహూకరించారు. ఈ బంగారు పూలను స్వామి, అమ్మవార్ల కైంకర్యాలలో వినియోగించాలని దాత కోరారు. మొత్తం 108 బంగారు పూల బరువు 19 గ్రాములు ఉంటుంది.. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో దాత వీటిని సీనియర్‌ వేదపండితులు గంటి రాధాకృష్ణ, పర్యవేక్షకుడు కె. అయ్యన్న, అమ్మవారి ఆలయ ఇన్స్‌స్పెక్టర్‌ కె. మల్లికార్జునకు అందజేశారు. అనంతరం దాత శివకుమార్‌ను వేదాశీర్వచనం, స్వామి, అమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలను అందజేసి సత్కరించారు.

మరోవైపు హిందూ జనశక్తి సంస్థ శ్రీశైలం దేవస్థానంలోని రెవెన్యూ, లీగల్‌ విభాగాల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేయడంతో.. ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. హిందూ జనశక్తి సంస్థ ప్రతినిధి లలిత్‌కుమార్‌ అక్రమాలకు సంబంధించిన పలు అంశాలను తన ఫిర్యాదులో ప్రస్తావించారు. దీంతో మొత్తం ఈ వ్యవహారంపై విచారణ చేయాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్‌ కార్యాలయ సంయుక్త కమిషనర్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ను విచారణాధికారిగా నియమించారు. అంతేకాదు ఈనెల 4న ఆదేశాలు జారీ చేయగా.. 15 రోజుల్లో విచారణ పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.

శ్రీశైలంలో చట్ట నిబంధనలకు విరుద్ధంగా దుకాణాల కేటాయింపు జరుగుతోందని.. శ్రీలలితాంబికా షాపింగ్‌ కాంప్లెక్స్‌లోని షాపుల కేటాయింపులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలువచ్చాయి.. దీంతో కొంతమంది కోర్టును ఆశ్రయించారు. ఆలయ ప్రాంగణంలోని షాపుల ఏర్పాటు, స్థలాల కేటాయింపులో కూడా అక్రమాలు అవకతవకలు జరిగాయంటున్నారు. కొందరు పైవేటు వ్యక్తులు అనధికారికంగా స్థలాలు అమ్ముతున్నారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. షాపులు ఏర్పాటు చేసుకునేందుకు, స్థలాలు కేటాయింపు ప్రక్రియ చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఉంది అంటున్నారు. షాపులు, స్థలాల కేటాయింపులో హైకోర్టు ఉత్తర్వుల్ని పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. భారీగా డబ్బులు చేతులు మారాయనే విమర్శలు వస్తున్నాయి. దీంతో ప్రభుత్వం ఈ అక్రమాలపై విచారణకు ఆదేశించింది.. ఒకవేళ అక్రమాలు జరిగనట్లు తేలితే చర్యలు కూడా తప్పవు అంటున్నారు.

ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది.శుక్రవారం జలాశయానికి ఇనఫ్లో పెరగడంతో డ్యాం అధికారులు జలాశయం ఆరు క్రస్టుగేట్లను తెరిచి దిగువ నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేశారు. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 884.40 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 212.9198 టీఎంసీలుగా ఉంది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-09-07T03:49:07Z dg43tfdfdgfd