కొబ్బరి బోండం కొండెక్కింది!

కొబ్బరి బోండం కొండెక్కింది!

  • నెలరోజుల్లో అమాంతం పెరిగిన బోండాల ధరలు 
  •  రూ.40 నుంచి రూ.60కుచేరిన ఒక్కో బోండం ధర
  •  కొబ్బరినీళ్ల లీటర్​  బాటిల్  రూ.150
  •  సమ్మర్ సీజన్​​ను క్యాష్ చేసుకుంటున్న వ్యాపారులు

హైదరాబాద్, వెలుగు:  సీజన్​తో సంబంధం లేకుండా అందరూ ఎక్కువగా తాగేది కొబ్బరి బోండం నీళ్లు. డాక్టర్లు కూడా ఎండాకాలంలో వేడి నుంచి ఉపశమనం పొందేందుకు కొబ్బరి బోండం తాగాలని సూచిస్తుంటారు. కొబ్బరి నీళ్లతో శరీరం డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవచ్చంటున్నారు. అలాంటి హెల్దీ డ్రింక్​ ధరలు ప్రస్తుతం మండిపోతున్నాయి. డిమాండ్​ఎక్కువగా ఉండడంతో సమ్మర్​ సీజన్​ను క్యాష్​ ​చేసుకునేందుకు వ్యాపారులు బోండం ధరలను అమాంతం పెంచేశారు. మొన్నటి దాకా రూ.30 నుంచి రూ.40లోపు లభించిన బోండం ధర ఇప్పుడు రూ.60కు చేరింది. లీటర్​ బాటిల్​ ​రూ.120 నుంచి రూ.150కు చేరింది.

సప్లయర్స్, హోల్​సేల్​ వ్యాపారులు ధరలు పెంచడంతోనే తాము కూడా పెంచి అమ్ముతున్నామని రీటైల్ వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం సిటీలో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటుతున్నాయి. గతంతో ఎన్నడూ లేనంతగా ఎండలు మండిపోతుండడంతో రోజంతా దాహం.. దాహంగా ఉంటోంది. మంచినీటితోపాటు ఫ్రూట్ జ్యూస్, నిమ్మరసం, కొబ్బరిబోండం నీళ్లు తాగాల్సి వస్తోంది. మామూలు రోజుల్లోనూ కొబ్బరి నీళ్లను జనం ఎక్కువగా తాగుతుంటారు. ప్రస్తుతం ఆ సంఖ్య డబుల్ అయింది. వేసవికి ముందు డెయిలీ 50 నుంచి 80 బోండాలు అమ్మేవాళ్లమని ప్రస్తుతం 200 బోండాలు అమ్ముడవుతున్నాయని బాగ్అంబర్ పేటలోని రిటైల్​వ్యాపారి శ్రీనివాస్​ చెప్పారు. అన్ సీజన్​లో 300 బోండాలు అమ్మేవాళ్లమని, ప్రస్తుతం 700 అమ్ముడవుతున్నాయని రాంనగర్​లోని హోల్ సేల్ వ్యాపారి గోపాలకృష్ణ​ తెలిపారు. ఏపీ నుంచి నెల ముందు దాకా డెయిలీ 100 కొబ్బరి బోండాల లోడ్లు వచ్చేవి. ఇప్పుడు ఆ సంఖ్య 200కు పెరిగింది. ఏపీ నుంచి డిమాండుకు తగ్గ సప్లయ్​లేదని, కర్ణాటక, కేరళ నుంచి దిగుమతి చేసుకుంటున్నామని వ్యాపారులు చెబుతున్నారు. 

తాగక తప్పట్లేదు

రెండు రోజులకోసారి ఇంట్లోకి కొబ్బరి బోండాలు కొంటాను. గతంలో నీళ్లున్న బోండం రూ.40 ఉండేది. ఇప్పుడు రూ.60 చెబుతున్నారు. లీటర్ బాటిల్ ధరను రూ.120 నుంచి రూ.150కు పెంచారు. ఇప్పుడున్న ఎండలను తట్టుకోవాలంటే కోకనట్ వాటర్ తీసుకోక తప్పట్లేదు. ధరలేమో మండిపోతున్నాయి. వ్యాపారులు ఇష్టారీతిన పెంచుతున్నారు.

– విశ్వనాథ్ శివ, ప్రైవేట్​ ఎంప్లాయ్, నల్లకుంట

డిమాండ్ డబుల్ అయింది

వేసవికి ముందు డెయిలీ300 కాయలు అమ్మేవాళ్లం. ఇప్పుడు 700 కాయలుఅమ్ముతున్నాం. ఏపీ నుంచి డెయిలీ 200 లోడ్లు వస్తున్నాయి. అన్​సీన్​లో 80కిమించి వచ్చేవి కాదు. ఎంత డిమాండ్ ఉన్నా.. మరో రెండు, మూడు వారాలే.. తర్వాత సేల్స్ తగ్గుతాయి. సీజన్ కావడంతోధరలు పెరిగాయి.

  – గోపాల కృష్ణ,కొబ్బరి బోండాల వ్యాపారి, రాంనగర్

  ©️ VIL Media Pvt Ltd.

2024-05-07T02:03:12Z dg43tfdfdgfd